అంటే సాయి -- నామ, రూప, కుల, మత, వయో భేదాలకు అతీతులు, సర్వవ్యాపీయైన ఆత్మయేనని స్పష్టమవుతుంది. ఆయన వయస్సు అపారమని తెల్పే ఆధారాలెన్నో వున్నాయి. అక్కల్కోటలో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ స్వామి సమర్థ నిర్యాణం చెందబోతూ, కనీరు కారుస్తున్న భక్తునితో, "శిరిడీ లో నా అవతారమూర్థి నీకు లభిస్తారు. ఆయనను సేవించు. నీకే కొరతా వుండదు." అని చెప్పారు. సాయిబాబా గూడా ఎందరో భక్తులకు అందుకు తగిన అనుభవమిచ్చారని మీరు చదువబోతారు. అంటే అక్కల్కోట స్వామియే సాయి అన్నమాట. ఈ యిద్దరూ సమకాలికులవడం ఒక అంతు బట్టని దైవలీల. అంటే ఆస్వామి వయస్సు, పుట్టుపూర్వోత్తరాలే సాయి యొక్క వృత్తాంతమన్నమాట. ఆ స్వామి వయస్సు వందలయేండ్లు. ఆయన రెండవ దత్తావతారమైన శ్రీ నరసిమ్హ సరస్వతియే. అంటే వారికి పూర్వావతారమైన శ్రీ పాద శ్రీవల్లభులే;అంటే స్వయంగా సనాతనుడిన దత్తస్వామియే అన్నమాట. ఆయనెందరికో అటువంటి దివ్యదర్శనాలు యిచ్చారు.
అంతేగాదు, ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి ఒకప్పుడు ఋషీకేశ్ తపోవనము వెళ్ళినప్పుడు, అక్కడ అపారమైన వయస్సుగల ఒక సాధువును దర్శించాడు. తర్వాత చాలా కాలానికి అతడు సాయిని దర్శించినప్పుడు, ఆ తపోవన సాధువు తామేనని ఆయన నిరూపించారు. అంటే సాయి వయస్సు గూడ అపారమేగదా!
అలానే రాజ్యం కోల్పోయి తిరుగుతున్న హుమాయూన్ కు తమ ఆశీస్సుల వల్లనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని, ఆ ముందటి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారే అలా జన్మించాడనీ సాయి ఒక భక్తునితో చెప్పారు. తాము గతంలో కబీరునన్నారు. రామాయణ, భాగవత కాలంలో గూడ తామున్నామని ఆయన చెప్పారు. ఈయన జన్మించిన మాట నిజమే అయితే నాటికే ఆయన పూర్ణుడైన జ్ఞానియని ఆయనయే ఒకసారు ఇలా సూచించారు. "నేను పుట్టినప్పుడు తనకు కొడుకు పుట్టాడని మా అమ్మ ఎంతగానో పొంగి పోవడం చూచి నేను ఆశ్చర్య పోయాను. ఆమె నన్ను కన్నదెప్పుడు? అసలు నాకు జననమున్నదా? నేను అంతకు ముందు లేనా? ఇంతమాత్రానికే ఈమే పొంగిపోతున్నదేమితి? అనుకొన్నాను."